బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి గణపతి పూజ, సాయంత్రం అంకుర్పాణ, పంచాగ శ్రవణం కార్యక్రమం జరిగింది. సాయంత్రం పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథం ఊరేగింపు కార్యక్రమం కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న వచ్చి తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందివర్గం ఎస్ఐ భూపాలుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గేట్స్లో జొన్నగిరి విద్యార్థికి 5వ ర్యాంక్
తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది. మునీర్ 1వరకు స్వగ్రామంలో, 2 నుంచి 10వరకు గుత్తి సెయింట్ మేరీ, ఇంటర్, బీటెక్ ఇడుపులపాయలో చదివాడు. తర్వాత గేట్ పరీక్షలకు ప్రిపేరైన ఈ విద్యార్థి జియో మాటిక్స్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. సివిల్స్ సాధించి ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని మునీర్ తెలిపారు. కొడుకు ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.


