కర్నూలు(హాస్పిటల్): గ్లకోమా పట్ల అప్రమత్తతతో చూపును కాపాడుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. బుధవారం ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి నుంచి రాజ్విహార్ వరకు నిర్వహించిన వాక్థాన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో గ్లకోమా చరిత్ర ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆసుపత్రి హెచ్ఓడీ డాక్టర్ యుగంధర్రెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిణి డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.


