
గిడుగు రామ్మూర్తి సేవలు ఎనలేనివి
కర్నూలు(అర్బన్): తెలుగు వైభవం కోసం పోరాటం నిర్వహించిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని, ఆయన సేవలు ఎనలేనివని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా స్థానిక మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ.. గిడుగు రామ్మూర్తి 1863 ఆగస్టు 29వ తేదిన జన్మించారన్నారు. తెలుగు వాడుక భాష పితామహుడుగా, గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకలోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సీ మురళీమోహన్రెడ్డి, బసవశేఖర్, రాంగోపాల్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఎంబీబీఎస్ మొదటి విడత అడ్మిషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో మొదటి విడత స్టేట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్లు శుక్రవారం ముగిశాయి. ఇందులో భాగంగా మంగళవారం 16 మంది, బుధవారం 10 మంది, గురువారం అధికంగా 110 మంది, చివరి రోజైన శుక్రవారం 15 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పటికే నేషనల్ కోటాలో 37 సీట్లకు గాను 28 మంది అడ్మిషన్ తీసుకున్నారు. రాష్ట్ర కోటా, నేషనల్ కోటాలో మిగిలిన సీట్లకు తర్వాతి విడత కౌన్సెలింగ్లలో భర్తీ చేయనున్నారు.
డీసీఎంఎస్లో కొత్త బ్రాంచీలు
● వెల్దుర్తి, ఆస్పరిలో
ఏర్పాటుకు చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) కొత్త బ్రాంచీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ ప్రాధాన కార్యాలయంతో కలిపి 17 బ్రాంచీలు ఉన్నాయి. డీసీఎంఎస్కు కొత్త పాలక వర్గం ఏర్పాటు తర్వాత కొత్త బ్రాంచీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టారు. మొదటగా వెల్దుర్తి, ఆస్పరిలో బ్రాంచీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఆఫీసు, గోదాముకు అవసరమైన భవనాలను గుర్తించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారం కోసం లైసెన్స్ల కోసం వ్యవసాయ శాఖకు దరఖాస్తు చేశారు. వీటి ఏర్పాటు తర్వాత బేతంచెర్లలో కూడా బ్రాంచీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డీసీఎంఎస్ పాలక వర్గం ఉంది.
పంటల వారీగా
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు
కర్నూలు(సెంట్రల్): పంటల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధి, సమర్థవంతమైన పనితీరుపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 28 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఉన్నాయని, ఆ సంఖ్యను పంటల వారీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీఓ)లను ఏర్పాటు చేసి, వారికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఇచ్చినట్లే, అక్కడ స్టోర్ చేసుకున్న కూరగాయలను ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేయవచ్చన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ వ్యవసాయాధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, ఎల్డీఎం రామచంర్రావు పాల్గొన్నారు.