
ఉగ్రవాదులను అంతం చేయాలి
కర్నూలు (టౌన్): ఉగ్రవాదులను అంతం చేయాలని పలువురు నేతలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్నారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల హత్యాకాండను నిరసిస్తూ ఆదివారం రాత్రి కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ‘ హిందూస్థాన్ జిందాబాద్.. పాకిస్తాన్ ముర్థాబాద్’ అన్న బ్యానర్ ప్రదర్శించారు. కశ్మీర్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ.. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు అతీతంగా ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కశ్మీర్ ఘటనను ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా ఖండిస్తున్నారన్నారు. టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బహిరంగంగా ప్రకటించిందన్నారు. కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయ మనోహరి మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాద చర్యలు సమూలంగా నిర్మూలించాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ అనుబంధ నాయకులు పాల్గొన్నారు.
కర్నూలులో కొవ్వొత్తులతో ప్రదర్శన