
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
● జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లలో పర్యటించిన ఎస్పీ
కర్నూలు: ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా అంతటా ఏకకాలంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అన్ని ముఖ్యమైన రోడ్లు, కూడళ్లల్లో రేడియం జాకెట్లు ధరించి పోలీసులు సరికొత్తగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పర్యటించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉల్చాల వై–రోడ్ జంక్షన్లో ఎస్పీ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచరింపు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. వివిధ కాలనీల్లోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానికంగా ఉంటున్న సమస్యల గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రజలతో మమేకం కావడంతో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందే వీలుంటుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్గౌడ్, నాగరాజరావు తదితరులు కూడా ఎస్పీ వెంట ఉన్నారు.