మచిలీపట్నంటౌన్: మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్టించే 63 అడుగుల మహాగణపతికి ప్రసాదంగా 630 కిలోల భారీ లడ్డూ తయారు చేస్తున్నట్లు మల్లయ్య స్వీట్స్ అధినేత గౌర వెంకటేశ్వర్లు తెలిపారు. ఈడేపల్లిలోని మల్లయ్య స్వీట్స్ తయారీ కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి కోరిన మేరకు ఈ భారీ బందరు లడ్డూను అత్యంత భక్తిశ్రద్ధలతో, నాణ్యమైన పదార్థాలతో తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ లడ్డూ తయారీకి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు. లడ్డూను ఉంచేందుకు ఇత్తడి రేకుతో ప్రత్యేక పాత్ర, తరలించేందుకు ప్రత్యేక ట్రాలీని తయారు చేశామన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ నెల 12వ తేదీన వివిధ కోర్టులలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులు బకాయిలు చెల్లించాలని సంస్థ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఇప్పటికే క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులకు న్యాయసేవాధికార సంస్థల ద్వారా నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు అందుకున్న వారు కోర్టుకి హాజరుకాకుండా ముందుగానే బకాయిలు చెల్లించొచ్చని తెలిపారు. ఈ సదావకాశాన్ని క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 11వ తేదీలోపు వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించుకోవటంతో పాటు సమస్య పూర్వాపరాలు పరిశీలించిన మీదట తగిన రాయితీ పొందొచ్చని తెలి పారు. మరింత సమాచారం కోసం 0866– 2444420, 0866 –2444588, 83338 98997, 94911 19556 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ప్రయాణికులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 120 సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేశారు. విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఆర్.జి.జయసూర్య ఈ వివరాలు వెల్ల డించారు. విజయవాడ సబ్ డివిజన్లయిన విజయవాడ, ఏలూరు, గుడివాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024–2026 మధ్య కాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్లు జె.వి.రమణ, దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్ఐ ఎం.షరీఫ్, సిబ్బంది జి.ఎ.నర్సయ్య, షేక్ సూరుద్దీన్, ఎం.భాస్కర్, రాంబాబు, ఐటీ కోర్ బృంద సభ్యులు పి.శివాజి గణేష్, ఎన్. హర్షవర్ధన్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సుమారు రూ. 25 లక్షల విలువైన 120 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశామని వివరించారు. వాటిని చట్టపరమైన ప్రక్రియను పూర్తిచేసి పోగొట్టుకున్న వారికి అప్పగిస్తామన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎం.అశోక్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతేఅలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): చెఫ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం విజయవాడలో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్.కె, ఉపాధ్యక్షుడు రామకృష్ణరాజు, జనరల్ సెక్రటరీ యాదగిరి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల కంటే, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అమరావతి రీజియన్కు నూతన కమిటీని ఎంపిక చేశారు.


