డీఎస్ఎంఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి ఆలీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మనువాద, మతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తోందని డీఎస్ఎఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి ఆలీ విమర్శించారు. కుల, లింగ వివక్షలను కొనసాగించడమే బీజేపీ పాలన అజెండాగా ఉందన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని పూలే అంబేడ్కర్ భవన్లో కేవీపీఎస్, అంబేడ్కర్ పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘కులం, మతం, సామాజిక న్యాయం’ అంశంపై కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన గురువారం సెమినార్ జరిగింది. సుభాషిణి ఆలీ మాట్లాడుతూ.. ఆర్థిక సమానత్వం లేకుండా సామాజిక న్యాయం, లింగ సమానత్వం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దళితులకు భూమి, ఇళ్లు, సామాజిక హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం, డి.రమాదేవి, నల్లప్ప, జి.క్రాంతి కుమార్, ఎం.డి.ఆనంద్ బాబు, బి.రఘురామ్, కె.క్రాంతి బాబు, తిరుపాల్, జి.రంగమ్మ, చీకటి రాజేష్, చింతల శ్రీనివాస్, టి.వెంకటేష్, ప్రాన్సిస్, చిరంజీవి, రమణ, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


