ప్రాజెక్టుల్లో నీరున్నా ఇవ్వడం లేదు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అధికార పక్షంలో ఉన్నట్టు లేరు సాగునీరు ఇచ్చి ఆదుకోమంటే ఏవో కబుర్లు చెబుతున్నారు రైతుల కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు
అవనిగడ్డ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వానలు పడవని, కరువు తాండవిస్తుందని ప్రజల్లో నమ్మకమని, ఇది మరోసారి రుజువైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాగునీరందక పంటలు ఎండిపోయి, నాట్లు వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరందించాలని కోరుతున్నా ప్రభుత్వానికి ఉలుకూ పలుకూ లేదన్నారు. పులిచింతల నుంచి 3 నుంచి 4వేలు క్యూసెక్కులు నీరు అందిస్తే కృష్ణాడెల్టాకు ఇబ్బంది ఉండదన్నారు. గతంలో ప్రాజెక్టుల్లో ఇంతకంటే తక్కువ నీటి నిల్వలు ఉన్న రోజుల్లో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీరిచ్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ను రైతులు అడుగుతుంటే ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారని, అధికార పక్షంలో ఉండి సాగునీటి కోసం డిమాండ్ చేయా ల్సింది పోయి మంత్రి నిమ్మల రామానాయుడుకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించి రైతులకు సాగునీరందించకపోతే రైతుల పక్షాన పోరుబాట పడతామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, రైతు విభాగం జిల్లా కార్యదర్శి సామర్ల రాముడు పాల్గ్గొన్నారు.


