చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై డిస్ట్రిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుతో కలిసి కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, దర్యాప్తు, చార్జ్షీట్ల దాఖలు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులు, బాధితుల సమస్యలపై చర్చించారు. కేసుల నమోదుకు, దర్యాప్తుకు, చార్జ్షీట్ల దాఖలుకు సంబంధించి నిర్దేశిత గడువులను అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు మాట్లాడుతూ బాధితుల భద్రతకు పోలీస్శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సున్నిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపడతామన్నారు.


