చిలకలపూడి(మచిలీపట్నం): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎం.వి. శ్యామ్నాథ్ పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని, బకాయిలు, పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్ల నగ దును వెంటనే చెల్లించాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.రావు, సీహెచ్.గోపాల్, గోపీచంద్ పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన ఏపీ డీ–ఫార్మసీ (ఎంపీసీ, బైపీసీ)లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి గురువారం తెలిపారు. దివ్యాంగులు, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ అభ్యర్థులు స్వయంగా హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఆరో తేదీ రాత్రిలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ఆప్షన్ల మార్పులు, చేర్పులకు ఈ నెల ఏడో తేదీ రాత్రి వరకు అవకాశం ఉందని తెలిపారు.


