డివైడర్ను ఢీకొన్న వాహనం ఒకరి మృతి, డ్రైవర్కు గాయాలు
నున్న(విజయవాడరూరల్): వెస్ట్ బైపాస్లో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నాటక నుంచి కేఏ 40బి –7892 నంబర్ టాటా దోస్తు వాహనం ద్రాక్షపండ్ల లోడుతో అనకాపల్లి వెళ్తోంది. మార్గం మధ్యలో.. నున్న గ్రామం సమీపంలో వ్యాను అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో వ్యాను ముందు సీటులో ఉన్న హేమంత్(25) ఘటనా స్థలిలో మృతి చెందగా, డ్రైవర్ రవితేజకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు బెంగుళూరుకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృత్తివెన్నులో పట్టపగలే భారీ చోరీ
కృత్తివెన్ను: పట్టపగలు నిత్యం జనసంచారం ఉండే 216 జాతీయ రహదారే సరిహద్దుగా ఉన్న గృహంలో భారీ దొంగతనం జరి గింది. కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం సీతనపల్లి పంచాయతీలోని సంగమూడి గ్రామపరిధిలో కూనసాని మోహనరావు ఇల్లు కృత్తివెన్ను ప్రధాన సెంటర్కు అతిసమీపంలో ఉంది. శనివారం అతని భార్య వేరే ఊరుకు వెళ్లగా కుమారుడు స్కూల్కు వెళ్లాడు. మోహనరావు తలుపులకు తాళం వేసి పొలానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 8.5 కాసుల బంగారు నగలతో పాటు కొంత మొత్తంలో నగదును దోచుకెళ్లిపోయారు. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళాలు పగలగొట్టి ఉండటం చూసి తండ్రికి ఫోన్ చేయగా ఆయన వచ్చి దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐతో పాటు బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్, డాగ్స్క్వాడ్, క్లూస్ టీంలు వచ్చాయి. డాగ్.. కాలనీలో వీధి చివర వరకు వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సీసీ టీవీ పుటేజ్లను సైతం పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. జనసంచారం ఉన్న జాతీయ రహదారి పక్కనే ఇంత భారీ దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయవద్దని ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ 11వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘సహకార బ్యాంకుల స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నిర్వహణలో రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వాల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలకు కో–ఆపరేటివ్ బ్యాంక్ సేవలను మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శి షేక్ అబ్దుల్ జిలాని తదితరులు పాల్గొన్నారు.


