దుర్గగుడిలో సెల్ఫోన్ల నిషేధం అమలయ్యేనా..! సాధారణ భక్తుల నుంచి వీఐపీల వరకు ఇదే తీరు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడిలో సెల్ఫోన్ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని దేవస్థానం అధికారులు రోజూ ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు కొందరు సెల్ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశిస్తుండటం, ఫొటోలు, వీడియోలు తీస్తుండటం నిషేధం అమలుపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఆదివారం పలువురు భక్తులు సర్వదర్శనం, రూ.100 టికెట్ క్యూలైన్లలో సెల్ఫోన్లతో కనిపించడమే కాకుండా మూలవిరాట్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. విషయం గమనించిన ఆలయ సిబ్బంది కొందరి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎస్ఎఫ్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం ఫోన్లలోని ఫొటోలు, వీడియోలను తొలగించి తిరిగి అప్పగించినట్లు తెలిసింది. ఒకేరోజు పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల గోవా ముఖ్యమంత్రితో వచ్చిన బృందంలోని ఓ వ్యక్తి గాలిగోపురం నుంచి బంగారు వాకిలి వరకు సెల్ఫోన్తో వీడియో తీసినట్లు సమాచారం. గతంలో ఓ మంత్రి వెంట వచ్చిన వ్యక్తి కూడా ఆలయంలో సుమారు ఆరు నిమిషాల పాటు వీడియో తీయగా, దానిని తొలగించినట్లు తెలుస్తోంది. ఇకనైనా ఆలయంలోకి భక్తులు, వీఐపీలు సైతం ఎవరూ సెల్ఫోన్లతో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.


