కృష్ణలంక(విజయవాడతూర్పు): దుస్తులు ఉతకడానికి బందరు కాలువ ఒడ్డుకు వెళ్లి అదృశ్యమైన ఓ వృద్ధురాలు ఆదివారం శవమై కనిపించింది. వివరాల మేరకు బాడవపేట అంబేద్కర్ వీధిలో నివసిస్తున్న వెంగలదాసు దుర్గ (70) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దుస్తులు ఉతకడానికి బందరు కాలువ ఒడ్డుకు వెళ్లి కనిపించ కుండా పోయిన విషయం తెలిసిందే. సాయంత్రం 5.30 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో మేనల్లుడు శిఖా నాగేంద్రబాబు.. ఆమె బట్టలు ఉతకడానికి వెళ్లిన బందరు కాలువ వద్దకు వెళ్లి చూడగా బట్టలు, చెప్పులు అక్కడే ఉన్నాయి. ఆమె మాత్రం కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీనిపై నాగేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు ఆదివారం బందరు కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు ఆమె మునిగిన చోటే శవమై కనిపించింది. దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మునిగి మరణించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


