గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించా లని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. నిర్దేశిత వయస్సులో వివరాలను అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు పొందే సమయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల వయస్సు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 5–7 సంవత్సరాలు, 15–17 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5–7 సంవత్సరాల వయసు పిల్లల్లో 31,184 మంది, 15–17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో 37,470 మంది బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 206 ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో పర్మనెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాఠ శాల, ఇంటర్మీడియెట్ విద్యా శాఖలతోపాటు ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి – జిల్లా ఆధార్ నోడల్ అధికారి కె.వై. ఎస్.ఆర్.రవికుమార్, హైదరాబాద్ యూఐడీఏఐ రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ ఎ.సత్యకళ, వీఎంసీ డెప్యూటీ కమిషనర్ శకుంతల, డీఎస్పీ సత్యనారాయణ, డీఈఓ సత్యకళ, డీఐఓ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ నాంచారారావు, డీఎం హెచ్ఓ, డ్వామా, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


