మచిలీపట్నం అర్బన్: రైతులకు అండగా నిలవాల్సిన రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లోనే కౌలు రైతులకు న్యాయం కరువైందని కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు విమర్శించారు. మంగళవారం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన బాధిత కౌలు రైతులు కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. సూరంపల్లి గ్రామంలోని ఆర్ఎస్కేలో ధాన్యం విక్రయించి ఏడాది దాటినా కౌలు రైతుల ఖాతాల్లో నేటికీ సొమ్ము జమ కాలేదని తెలిపారు. ఒక్కోసారి ఒక్కో విధంగా మాటలు చెప్పి రైతులను నమ్మించి చివరకు మోసం చేశారని ఆరోపించారు. పలువురు బాధిత కౌలు రైతులు మాట్లాడుతూ.. ఆర్ఎస్కేలో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు మధు, దిలీప్ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో తమను నమ్మించారని తెలిపారు. తమ నుంచి సరైన ఆధారాలు లేకుండానే ధాన్యం తీసుకుని, ఇతరుల పేర్లతో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచా యితీ నిర్వహిస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు సొమ్ము అందలేదని వాపోయారు. మరోవైపు తమ నుంచి కౌలు రైతులు ధాన్యం విక్రయించిన విషయం వాస్తవమేనని తహసీల్దార్ సైతం నివేదిక ఇచ్చినట్లు రైతులు తెలిపారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగకపోవడంతో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే తాము ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం ఇచ్చామని జాయింట్ కలెక్టర్ సమాధానం ఇచ్చారని రైతులు వాపోయారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్ఎస్కేలో ధాన్యం కొనుగోలు జరి గితే.. అక్కడ ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తమకు జరిగిన మోసంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, తమకు నగదు ఇప్పించాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కౌలు రైతులు వి.వెంకట నాగు, స్వామిశెట్టి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, నున్న శంకర్, పామర్తి వెంకటేశ్వరావు, బెజవాడ తాతబ్బాయి, కై లే ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.


