రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ఐజీ–పీసీపీసీ (ఇన్స్పెక్టర్ జనరల్–ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్) అంజనీ కుమార్ సిన్హా ఆదివారం విజయవాడ డివిజన్లో పర్యటించి ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణపై ఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినం దించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ షణ్ముఖ వడివేల్ ప్రస్తుత ఏడాది ఆర్పీఎఫ్ సాధించిన ప్రధాన చర్యలను ఐజీ–పీసీఎస్సీ దృష్టికి వివరించారు. ఉన్నత ప్రమాణాలతో సేవలందించామన్నారు. జన్ విశ్వాస్ చట్టం 2006 కింద వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 2,948 మందిపై కేసులు నమోదు చేసి రూ. 21,84, 700 జరిమానా విధించినట్లు తెలిపారు. ఆపరేషన్ అమానత్ పథకం ద్వారా రూ. 01,45,04, 437 విలువైన 355 లగేజీలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించామన్నారు. రైల్వే చోరీలపై 70 కేసుల్లో 61 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 61,85,600 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉన్నత ప్రమాణాలతో సేవలు


