గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్లా ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఎన్జీవో హోంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమపై ఆధారపడి అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారి జీవనోపాధికి బాటలు వేయాలన్నారు. ఉపాధ్యక్షుడు జంధ్యాల గోపాలకృష్ణ మాట్లా డుతూ.. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణను కలసి త్వరాలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా మాట్లాడుతూ.. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. స్టూడియోలు, రికార్డింగ్,రీ రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు కె.అప్పారావు, ఎస్.హరనాథ్, మల్లికార్జున చౌదరి, జె.సరోజిని, ముళ్లపూడి రాధ, షహనాజ్, పిల్లి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
(ఎంఏఏ) అధ్యక్షుడు పిళ్లా ప్రసాద్


