చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి అర్హుడికి ఓటు హక్కు ఉండేలా చేసేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఎల్వోల ద్వారా అందజేస్తున్న ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి తిరిగి అందజేయటం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంలో చాలా మంది ఓటర్లు ఫారాలు తీసుకున్నప్పటికీ వాటిని తిరిగి ఇవ్వటంలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. జూలై 14వ తేదీలోపు అన్ని ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఓటరు వెంటనే వారి వారి ఫారాలను సంబంధిత బీఎల్వోకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఫారాలు అందని వారు సంబంధిత బీఎల్వోను సంప్రదించి సహాయం పొందవచ్చన్నారు. అలాగే voters. eci. gov. in వెబ్ సైట్, ECI NET యాప్లో బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో సదుపాయం ద్వారా వారితో నేరుగా సంప్రదించి ఫారం పొందవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామన్నారు. సందేహాలు ఉంటే జిల్లా హెల్ప్డెస్క్ 1950ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మండల, మునిసిపాలిటీ కేంద్రాల్లో హెల్త్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు తమ ఎపిక్ నంబరు ఆధారంగా వెబ్సైట్లో స్వయంగా కూడా ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్ పాల్గొన్నారు.


