ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డీఈవో ఎల్. చంద్రకళతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. 27,360మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించామని.. 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యి మీటర్లలోపు జిరాక్సు షాపులు తెరిచి ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చన్నారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ 9154970454కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
పూర్తి పారదర్శకంగా..
డీఈవో చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబరును ఆన్సర్ స్క్రిప్ట్ లేదా ఓఎంఆర్ షీట్పై ఎక్కడా రాయకూడదన్నారు. ప్రత్యేక అవసరాలున్న (సీడబ్ల్యూఎస్ఎన్) 193 మంది విద్యార్థులకు స్కైబ్లను ఏర్పాటు చేశామనిని.. వీరికి గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు.


