ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు, ఉగాది పర్వదిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయానికి చేసే పూల అలంకరణ, పంచాంగ శ్రవణం, విశేష పూల అర్చనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వెండి రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.
చైత్ర బ్రహ్మోత్సవాల పైన చర్చ
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించే చైత్ర మాస బ్రహ్మోత్సవాలపైన చర్చ జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వాహన సేవలు, వెండి రథోత్సవంతో పాటు ఉత్సవాల చివరి రోజున జరిగే హంస వాహన సేవ ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వి.శ్రీధర్శర్మ, ఏసీ రంగారావు, ఏఈవోలు బి.వి.రెడ్డి, పి.చంద్రశేఖర్, కె.గంగాధర్, ఈఈ ఎల్.రమ పాల్గొన్నారు.


