125 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఇటీవల జరిగిన మహా కుంభాభి షేకం ఉత్సవాల్లో చోటుచేసుకున్న బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్కు చెందిన కాకర్ల సుష్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం రావిచెట్టు వద్ద పూజలు చేసి బయటకు వచ్చిన తరువాత ఆమె బ్యాగ్లో ఉండాల్సిన బంగారు ఆభరణాల పెట్టె కనపడకుండా పోయింది. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా, విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె కొండ దిగి, ఆటో ఎక్కి స్థానికంగా ఉన్న లాడ్జికి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి విచారించగా ఆమె నకిలీ ఆధార్, తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చినట్లు తేలింది. అయితే ఆమె అక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయటంతో ఆ వివరాలు, ఫోటో సాయంతో ఆమె విశాఖపట్నంకు చెందిన కోవెలకొండ నీరజ(27)గా గుర్తించారు. ఆమె ఐదో తేదీన విశాఖపట్నంలో, ఆరో తేదీన విజయవాడలో ఉన్నట్లు ఫోన్ డేటా ధ్రువీకరించుకొని ఆమెను ఆమె నివాసంలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. ఆమె చోరీ చేసిన 125 గ్రాముల విలువైన వివిధ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వివరించారు.


