
ఆరోగ్య గమ్యానికి సైకిల్ సవారీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్యం, ఆహ్లాదం.. ఆపై పర్యావరణ పరిరక్షణకూ సైక్లింగ్ చేయూతనిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. చిన్నారులు, యువత సైకిల్ సవారీని అలవాటుగా చేసుకోవాలన్నారు. సైకిల్ సవారీ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పెడల్ ఫర్ ఫిట్నెస్ అండ్ యూనిటీ ఇతివృత్తంతో నిర్వహించిన సైకిల్ రైడ్లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఈ రైడ్ బెంజిసర్కిల్, రామవరప్పాడు, బీఆర్టీఎస్ రోడ్డు, గాంధీనగర్, మునిసిపల్ ఆఫీస్, ప్రకాశం బ్యారేజ్, కంట్రోల్ రూమ్, స్టేడియం వరకు మొత్తం 21 కి.మీ. మేర సాగింది. దాదాపు 80 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని ఐక్యతా మార్గంలో క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పారు. అనంతరం లండన్ – ఎడిన్బర్గ్ – లండన్ (ఎల్ఈఎల్) సైక్లింగ్ ఈవెంట్ – 2025లో పాల్గొన్న నిషికాంత్ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అమరావతి రన్నర్స్ ప్రెసిడెంట్ ఆర్.రమేష్ రవి, సభ్యులు బసవేశ్వరరావు, జీవీ సత్యనారాయణ, నిషికాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ