చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 145 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 8.30 గంటలకే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. ముందుగా సమీపంలోని దేవాలయాలకు వెళ్లి హాల్టిక్కెట్లను స్వామివారి వద్ద ఉంచి పూజలు జరిపించుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల హాల్టిక్కెట్లను పరిశీలించిన అనంతరం వారిని లోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన నోటీసుబోర్డుల ఆధారంగా హాల్టిక్కెట్ల నంబర్ల ప్రకారం ఏ రూమ్ను కేటాయించారో పరిశీలించు కుని ఆ రూమ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ఇన్విజిలేటర్లు జవాబుపత్రాలు, ప్రశ్నాపత్రాలను అందజేశారు.
అధికారుల పరిశీలన
జిల్లాలో 21,072 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 20,822 మంది హాజర య్యారు. ప్రైవేటు విద్యార్థులు 90 మందికి 54 మంది హాజరయ్యారు. జిల్లా అబ్జర్వర్ కృష్ణమోహన్ గన్నవరంలోని జెడ్పీహెచ్ఎస్, స్రవంతి ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ పి.వి.జె.రామారావు మచిలీపట్నం నగరంలోని భాష్యం, పాండురంగ హైస్కూల్, నిర్మల హైస్కూల్, కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లను తనిఖీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వ పరీక్షలు డేవిడ్ రాజు పెడన మండలంలోని రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 36 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని డీఈఓ రామారావు తెలిపారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ
తొలి రోజు పరీక్షలకు20,822 మంది విద్యార్థులు హాజరు