పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టండి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): పరిశ్రమల స్థాపన ద్వారా యువత జీవితంలో స్థిరపడటంతో పాటు రాష్ట్రాభివృద్ధిల్లో భాగస్వాములు కావచ్చని జిల్లా పరిశ్రమల సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా జనరల్ మేనేజర్ వై.వీరశేఖర్ చెప్పారు. బుధవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల స్థాపనపై అవగాహన సదస్సు జరిగింది. వీరశేఖర్ మాట్లాడుతూ యువత పరిశ్రమల స్థాపన వల్ల వారు మరికొంత మందికి ఉపాధి చూపవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, ప్రాజెక్టు రిపోర్టు తయారీ, దరఖాస్తు చేసుకునే విధానాల గురించి ఆయన వివరించారు. లీడ్ బ్యాంక్ ఎన్టీఆర్ జిల్లా మేనేజర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రాయితీల గురించి వివరించారు. ఖాదీ విలేజ్ ఇండ్రస్టీయల్ బోర్డు అధికారి ఎన్.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోందని, వాటిని ఉపయోగించుకుని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విజయసారథి, ప్లేస్మెంట్స్ ఆఫీసర్ కె.విజయ భాస్కర్తో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా పరిశ్రమల సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా జనరల్ మేనేజర్ వీరశేఖర్