ఇప్పటికే ముగిసిన రెండేళ్ల కాలపరిమితి నాలుగేళ్లు ఉంటామన్న గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ప్రతిపక్ష సంఘాల పట్టు దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
శ్రీరాంపూర్: సింగరేణిలో ఎన్నికల వార్ మొదలైంది. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితిపై కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి రెండేళ్లే అని ప్రతిపక్ష సంఘాలు.. కాదు నాలుగేళ్లని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ వాదిస్తోంది. ఇంతటితో ఆగకుండా టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ లాంటి కార్మిక సంఘాలు ఎన్నికల కాలపరిమితిపై కోర్టులో రిట్ పిటిషిన్ దాఖలు చేశాయి. సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు డిసెంబర్ 27, 2023న నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐదు ఏరియాల్లో గెలిచి కంపెనీ వ్యాప్తంగా అత్యధిక ఓట్లు రావడంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, ఆరు ఏరియాల్లో గెలిచినా తరువాత స్థానంలో ఓట్లు రావడంతో ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా నిలిచింది. ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలల తర్వాత అక్టోబర్ 9, 2024న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం, ఐఎన్టీయూసీకి ఆయా ఏరియాల్లో ప్రాతినిధ్య హోదా కల్పిస్తూ కంపెనీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో రెండేళ్ల కాలపరిమితిని పెట్టింది. దీని ప్రకారం కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ మినహా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎల్సీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్లోనూ ఈ నిబంధన ఉందని వాదిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు ఏడుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా మొదటిసారి 1998లో మాత్రమే రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరిగాయి. తరువాత గెలిచిన అన్ని సంఘాలు నాలుగేళ్లు అఽధికారంలో కొనసాగాయి. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎల్సీ నుంచి, కంపెనీ నుంచి కాలపరిమితిపై స్పష్టత ఇవ్వకపోవడం, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు తమ అనుకూలత కోసం ఉన్న కార్మిక సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రావడంతో నాలుగేళ్ల అధికారాన్ని అనుభవించాయి.
15న కోర్టులో వాదనలు
గుర్తింపఎన్నికలు వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు డిప్యూటీ సీఎల్సీ, సింగరేణి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. టీబీజీకేఎస్ వేసిన పిటిషన్పై ఈ నెల 15న వాదనలు జరగనున్నాయి. కాగా, మళ్లీ ఎన్నికలు జరిగేవరకు అన్ని సంఘాలను సమానంగా గౌరవించాలని ఆయా సంఘాలు లేఖలు రాసి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏడో దఫా ఎన్నికల ముందు సమాన హోదా కల్పిస్తూ కంపెనీ ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ఏఐటీయూసీ నేతలు తోసిపుచ్చుతున్నారు.
తెరపైకి లేబర్ కోడ్లు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు అమలు చేయాలని సీఎల్సీ నిశ్చయంతో ఉంది. ఈ మేరకు డిప్యూటీ సీఎల్సీ కొత్త లేబర్ కోడ్లకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఇకముందు గుర్తింపు సంఘం కాలపరిమితి మూడేళ్లు ఉంటుందని, గుర్తింపు సంఘం, యాజమాన్యం ఒకే అభిప్రాయంతో ఉంటే దీన్ని గరిష్టంగా ఐదేళ్లు కొనసాగించుకునేలా కొత్త చట్టంలో అవకాశముంది. ఈ లేబర్కోడ్ల ప్రకారం ఎన్నికలు జరిగితే 51శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు హోదా దక్కుతుంది. అంతకంటే తక్కువ వస్తే, అది కూడా 20శాతం మించి ఓట్లు వస్తేనే వారికి ప్రాతినిధ్య హోదా ఇస్తారు. ఎన్ని సంఘాలకు 20శాతం మించి ఓట్లు వస్తే అన్ని సంఘాల నుంచి ప్రతినిధులను కంపెనీ కార్మికుల ప్రతినిధులుగా (నెగోసేషన్ కౌన్సిల్ మెంబర్గా)గా గుర్తిస్తుంది. ఇదే జరిగితే కార్మిక సంఘాలన్నీ నిర్వీర్యం కావడం ఖాయమని, కార్మికుల డిమాండ్లకు బలం ఉండదనే వాదన వినిపిస్తోంది.


