● సమ్మెకు దిగినా స్పందించని ప్రభుత్వం
ఆసిఫాబాద్అర్బన్: ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇదేరోజు అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, నేటికి మూడేళ్లయినా పట్టించుకోవడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. డిమాండ్ల సాధనకు నెలపాటు సమ్మెబాట కూడా పట్టారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాంలు, మధ్యా హ్న భోజనం బియ్యం సరఫరా, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆన్లైన్లో విద్యార్థుల నమోదు, బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం లాంటి విధులు నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో సీ ఆర్టీలు, పీజీ సీఆర్టీలు బోధన విధులు నిర్వహిస్తుండగా, బోధనేతర సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు కేజీబీ వీల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. అ కౌంటెంట్లు, ఏఎన్ఎంలు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, మండల స్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, వ్యా యామ, ఒకేషనల్ ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, డే అండ్ నైట్ వాచ్మెన్లు, స్వీపర్లు, స్కా వెంజర్లు, జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టం ఎనలిసిస్ట్లు, టెక్నికల్ పర్సన్లు, డీఎల్ఎంటీ మెస్సెంజర్లు, మోడల్ స్కూళ్లల్లో పనిచేసే వార్డెన్లు, ఆపరేటర్లు, కేర్ టేకర్లు కూడా సమగ్ర శిక్ష పరిధిలోకి వస్తారు.
జిల్లాలో 440 మంది..
జిల్లా వ్యాప్తంగా 440 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పని చేస్తున్నారు. కస్తూరిబా విద్యాలయాల్లో 347 మంది పని చేస్తుండగా 54 మంది సీఆర్పీ లుగా, 10 మంది సీసీవోలుగా, 11మంది ఎంఐఎస్సీవోలుగా, 18 మంది ఐఈఆర్పీలుగా విధులు నిర్వరిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు కలెక్టర్ పంపించే యూడైస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాప్ట్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష పరిధిలోకి వస్తారు. వీరు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక కుటుంబాన్ని పోషించుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతూ మానసికంగా కుంగిపోతున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు ఇవే..
తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నారు. పార్ట్టైం ఉద్యోగులను ఫుల్టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ.20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని, ప్రతీ ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు (ఫైల్)


