వలస ఓటర్లకు గాలం
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం పోలింగ్ రోజు రప్పించేందుకు ఏర్పాట్లు రానుపోను ఖర్చులకు ముందుగానే అడ్వాన్స్! రంగంలోకి ప్రత్యేక టీంలు
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకం కానుంది. ప్రతీ అంశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో 65,110 ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 35,285 మంది ఉండగా, పురుషులు 31,815 మంది ఉన్నారు. మొత్తంగా 3,470 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరిలో విద్యార్థులు, పలువురు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. అంతేకాకుండా అద్దె నివాసాల్లో ఉండే ఓటర్లు ఇళ్లు మారినా, ఓటరుగా నమోదై ఉన్నారు. వారందరినీ గుర్తించి ఓట్లు పొందేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థుల తరపున ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
5వేల మందికి పైగానే..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లలో సుమారు 5వేల మందికిపైగానే ఉన్నత చదువులు, ఉద్యోగాల రీత్య హైదరాబాద్, వరంగల్, చంద్రాపూర్, ఇతర పట్టణాల్లో ఉంటున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్లో ఉంటున్నారు. వీరందరిని పోలింగ్ రోజు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారి సంబంధీకుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి వారితో మాట్లాడుతున్నారు. పోలింగ్ రోజు తప్పకుండా వచ్చి ఓటు ద్వారా తమకు మద్దతు తెలపాలని వేడుకుంటున్నారు. అందుకోసం ఓటర్ల కు రానుపోను ఖర్చులు చెల్లించడంతో పాటు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ముందుగానే అడ్వాన్స్లు కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
వార్డు కష్టాలు..
మున్సిపాలిటీ పరిధిలో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అనేక మంది ఓటర్లు అద్దె నివాసాల్లో ఉంటూ వివిధ పనులకు వెళ్తుంటారు. వీరిలో చాలా వ రకు ఇళ్లు మార్చారు. కానీ ఓటు బదిలీ మాత్రం జరగకపోవడంతో పాత వార్డులోనే ఓట్లు ఉన్నాయి. వీ రిని వెతికేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. వార్డుల వారీగా బాధ్యులను నియమించారు. వారు ఏ ఓటరు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారో తెలుసుకొని వారిని కలుస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులే నేరుగా వెళ్లి కలుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు.


