నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆసిఫాబాద్: అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అభ్యర్థులతో వ్యయ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. ఖర్చుల వివరాలను నిర్దిష్ట కాల పరిమితిలోగా సమర్పించాలన్నారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహణ, రికార్డుల సంరక్షణ, ఖర్చుల పరిమితులపై అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఎన్నికల వ్యయ నోడల్ అధికారి నదీమ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, మాస్టర్ ట్రైనర్ ఊషన్న, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కాగజ్నగర్రూరల్: ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చుల వివరాలను సకాలంలో సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేవేందర్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఖర్చుల పరిమితులు, ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహణ, రికార్డుల సంరక్షణపై అవగాహన కల్పించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


