నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్
కెరమెరి: ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే ప్రయోగ పరీక్షలను ఈ నెల 2 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 11 ప్రభుత్వ, 4 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 15 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,691 మంది హాజరుకానున్నారు. గతనెల 21, 22 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిషు ప్రయోగ పరీక్షలు నిర్వహించగా 25 నుంచి 31 వరకు ఫ్రీఫైనల్ పరీక్షలు కొనసాగాయి.
ఒకే రోజు రెండు పరీక్షలు
ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్ రెండు సెషన్స్లలో కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్లో 20 నుంచి 25 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కుల పేపర్ ఉంటుంది. అందులో 11 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లే. ఇందుకు విద్యార్థులు కసరత్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాల నిఘా నీడలో
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ అధికారులు మాధ్యమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగా ఆయా కళాశాలల్లో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలు నిఘా నీడలో కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, ప్రీఫైనల్ పరీక్షలు సీసీ కెమెరాల మధ్య కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కో కాలేజీలో 16 సీసీ కెమెరాలను అమర్చింది. అధ్యాపకుల బోధన తీరు, విద్యార్థుల క్రమశిక్షణ, ఇతరత్రా కార్యకలాపాలను రాష్ట్ర అధికారులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం అయింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్స్ పరీక్షలు కూడా నిఘా నీడలో కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆయా కళాశాల అధ్యాపకులు విద్యార్థులను సంసిద్ధం చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
రేపటి నుంచి ప్రారంభమయ్యో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలోని 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నాం. 4,619 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి.
– రాందాస్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్


