విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కలెక్టరేట్ సముదాయంలోని మహిళాశిశు సంక్షేమం, జిల్లా ఖజాన, ముఖ్యప్రణాళిక, పౌరసరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ విభాగం కార్యాలయాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. సిబ్బంది రాకపోకల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమయ పాలన పాటించని అధికారులు, సిబ్బందిని ఉపేక్షించబోమన్నారు. ఆలస్యంగా వచ్చేవారిని సీసీకెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మార్చి 15లోగా పనులు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు మార్చి 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో గురువారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్, అటవీశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సెర్ప్ ఏపీఎంలతో సమీక్షించారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు మార్చి 15లోగా పూర్తి చేయాలన్నారు. రూ.10లక్షలతో గ్రామ సమాఖ్య భవనాలను నిర్మించేందుకు జిల్లాలో 222 భవనాలను మంజూరు చేశామని తెలిపారు. మండలానికి ఒకటి చొప్పున రూ.30లక్షలతో ఫుడ్ గ్రెయిన్ స్టోరేజీ గోదాంల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సర్పంచుల సహకారంతో పనులు వేగవంతం చేయాలన్నారు. సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు నిర్మించాలని సూచించారు.


