ఖాళీలే అన్నీ..
అంగన్వాడీ..
అస్తవ్యస్తంగా కేంద్రాల నిర్వహణ
పై చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణి మండలంలోని అమీన్గూడ (కోయ తలండి) గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రం. ఇందులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ పదేళ్ల క్రితం ప్రమోషన్పై బదిలీపై వెళ్లింది. ఎనిమిదేళ్ల క్రితం ఆయా మృతి చెందింది. అప్పటినుంచి అంగన్వాడీ కేంద్రం తెరుచుకోవడం లేదు. దీంతో పక్కనున్న తలండి అంగన్వాడీ టీచర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆ గ్రామంలోని లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. ఈ సమస్య జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉంది.
తిర్యాణి: జిల్లాలో చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాలు మూసే ఉంటున్నాయి. టీచర్లు, ఆయాలు లేకపోవడమే ఇందుకు కారణం. అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు లేకపోవడంతో ఏళ్లుగా కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల టీచర్లుంటే.. కొన్నిచోట్ల ఆయాలు లేరు. కొన్ని చోట్ల ఆయాలు ఉంటే.. టీచర్లు లేరు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల ఉంది. టీచర్లు లేని చోట ఆయాలే టీచర్ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఆయాలు అటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వంట చేస్తూ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు చూస్తూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా చిన్నారులకు అక్షరాలు నేర్పేవారే కరువయ్యారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల అమలుకూ టీచర్లు లేక పూర్తిగా విజయవంతం కావడం లేదు.
ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం
జిల్లాలోని జైనూర్, సిర్పూర్(యూ), కెరమెరి, తిర్యాణి, లింగాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్నారు. ఆయా మండలాల్లోని పీవీటీజీ ప్రాంతాల్లో చదువుకున్న మహిళల సంఖ్య తక్కువగా ఉంది. గత నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్గా, ఆయాగా పని చేయాలంటే స్థానికతను ఆధారంగా తీసుకునేవారు. వివాహానంతరం అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఇలాంటి నిబంధనలతో గతంలో పలుచోట్ల ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జీలతో నెట్టుకువస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్గా పనిచేయాలంటే కనీస అర్హత ఇంటర్తో నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. దీంతో అర్హులు లేని గ్రామాల్లో మళ్లీ ఖాళీలేర్పడే అవకాశముంది. ఈ ఖాళీల భర్తీపై డీడబ్ల్యూవో పీడీ భాస్కర్ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని సృష్టం చేశారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలి
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు వెంటనే అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో సి బ్బంది లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేయాలి.
– బోగే ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
నోటిఫికేషన్ కోసం నిరీక్షణ
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్ (టి), వాంకిడి, జైనూర్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1,006 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతీ కేంద్రానికి ఒక టీచర్, హెల్పర్ ఉండాలి. 1,006 కేంద్రాల్లో ప్రస్తుతం 841 టీచర్లు, 559 మంది హెల్పర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదు ప్రాజెక్టుల పరిధిలో 165 టీచర్ పోస్టులు, 447 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి సంబంధించి నేటికీ ప్రభుత్వం నుంచి సృష్టమైన ప్రకటన విడుదల కాలేదు. వందల సంఖ్యలో ఖాళీ లుండగా నిరుద్యోగులు ప్రభుత్వం నియామకాలు చేపడితే దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఖాళీలే అన్నీ..


