
రైతులకు భూభారతిపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
లింగాపూర్/జైనూర్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై రైతులకు అవగాహన ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. లింగాపూర్ మండలకేంద్రంతోపాటు సిర్పూర్(యూ) మండలం మహాగామ్, జైనూర్ మండలం గౌరిలోని రైతువేదికల్లో మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 30 వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అప్పీల్ వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం లింగాపూర్లో బావులు, బోర్లు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, ఎంపీడీవోలు రాంచందర్, రామకృష్ణారావు, తహసీల్దార్ ఉదయ్కుమార్, మండల ప్రత్యేకాధికారి జాదవ్ గుణవంత్రావు, డీటీ పెద్దిరాజు, ఏవో సంజయ్కుమార్, ఏఈ మల్లయ్య, ఎంపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
ఆసిఫాబాద్: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో భూభారతి ఆర్వోఆర్ చట్టం అవగాహన సదస్సులు, పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, మిగిలిన గ్రామాల్లో అర్హుల జాబితా రూపకల్పన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంలోని అంశాలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, చట్టం హక్కులు, అంశాలను వివరించాలన్నారు. అలాగే పైలట్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, మిగిలిన గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రతిపాదించిన జాబితాను గెజిటెడ్ అధికారులతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. సిర్పూర్(యూ) తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై జిల్లాలోని ఆరు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 28 వరకు మిగిలిన తొమ్మిది మండలాల్లో పూర్తి చేస్తామన్నారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.