ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్) పీసీఏ (ప్రైవేట్ కలెక్షన్ ఏజెన్సీ)ల ద్వారా ఆన్లైన్ మొబైల్ కలెక్షన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానాన్ని బుధవారం తొలిసారిగా ఖమ్మంలో ప్రారంభించారు. ఈ విధానంలో ఏజెంట్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి నగదు స్వీకరించి, అక్కడికక్కడే ఆండ్రాయిడ్ సెల్ఫోన్ ద్వారా చెల్లింపు రశీదు జారీ చేస్తారు. దీంతో వినియోగదారులకు చెల్లింపులపై భరోసా ఉంటుంది. అంతేకాక ఇతర పేమెంట్ యాప్ల మాదిరి అదనపు చార్జీలు ఈ విధానంలో ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల వద్దే నగదు స్వీకరించి, రశీదు ఇచ్చే విధానాన్ని ఖమ్మం టౌన్–త్రీ కలెక్షన్ సెంటర్లో ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ప్రారంభించి వివరాలు వెల్లడించారు.
వసూలు సమయంలోనే ఆన్లైన్ రశీదు ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఎలక్ట్రిసిటీ మ్యూచువల్లీ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సమన్వయంతో పీసీఏల సేవలను వినియోగిస్తూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు జి.శ్రీధర్, నంబూరి రామారావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం నుంచి ప్రారంభించిన
ఎన్పీడీసీఎల్


