నేలకొండపల్లి: జిల్లాలో సాగర్ జలాల ద్వారా అందిస్తున్న నీటితో ప్రస్తుతం ఆరు చెరువులు మాత్రమే పూర్తిగా నిండాయని, తాగునీటికి తప్ప ఇతర అవసరాలకు నీరు వృథా చేస్తే చర్యలు తప్పవని జల వనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని చెన్నారం, రాజేశ్వరపురం గ్రామాల వద్ద పాలేరు పాత కాల్వలను బుధవారం ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 1,400 చెరువులు ఉండగా.. కేవలం ఆరు చెరువులే నిండాయని, 700 చెరువుల్లో 25 శాతం, మరో 300 చెరువుల్లో 50 శాతం మాత్రమే నీరు ఉన్నట్లు తెలిపారు. వైరా, లంకసాగర్ రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉందని, పాలేరు రిజర్వాయర్కు 1,552 క్యూసెకుల నీరు వస్తుండగా.. పూర్తిస్థాయిలో నిండాక తాగునీటి కోసం మాత్రమే విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం 23 అడుగులకు గాను 20.50 అడుగులకు చేరినట్లు తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు మూడు నెలలు పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. కాగా, చెరువుల నీటిని చేపల వేట కోసం విడుదల చేస్తే కేసులు తప్పవని, అలా జరగకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఉద్యోగు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈఈలు పొట్టయ్య, బుచ్చిబాబు, జేఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు


