బోనకల్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్)లో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ) పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అర్హుల ఓటు హక్కు పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బీఎల్ఏల పాత్ర అభినందనీయ మన్నారు. బోనకల్ మండలం జానకీపురంలో శనివారం రాత్రి మండల బీఎల్ఏలు, వారి కుటుంబీకులతో ఆయన సమావేశమై భోజనం చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జాబితా నుంచి తొలగించిన, మరణించిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు గుర్తించాలన్నారు. అలాగే, అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్ల ద్వారా సరైన పత్రాలను ఇప్పించి ఓటు హక్కు కొనసాగేలా చూడాలన్నారు. బీఎల్ఏలు, పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం అమలుపై దృష్టి సారించాలని, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఎవరెవరికి అందాయో లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


