కూసుమంచి: పంట వివరాల నమోదుకు చేపడుతున్న డిజిటల్ క్రాప్ సర్వేలో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. కూసుమంచి మండలం గురువాయిగూడెంలో సర్వే ను శనివారం ఆయన పరిశీలించి ఉద్యోగులు, వలంటీర్లకు సూచనలు చేశారు. ప్రతీ రైతు సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేయాలని, తద్వారా ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్ల సమయాన ఇబ్బంది ఎదురుకాదని చెప్పారు. అంతేకాక ప్రకృతి విపత్తులు ఎదురైతే పరిహారం చెల్లింపు కూడా సులువుగా ఉంటుందని తెలిపారు. కాగా, కూసుమంచి రైతువేదికలో ఏర్పాటుచేసిన శిక్షణలో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణతో డీఏఓ పుల్లయ్య మాట్లాడారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నానో ఎరువుల వాడకంపై అవగాహన పెంచుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మ ప్రాజెక్టు డైరక్టర్ సరిత, ఏడీఏ రాజేష్, ఏఓలు వాణి, రాధ, ఉమానగేష్, అరుణజ్యోతి, ఆత్మ బీటీఎం ఉపేందర్, ఏఈఓలు పాల్గొన్నారు.


