ఖమ్మంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్
● ఆర్చరీ పోటీల నిర్వహణకు ఓకే..
ఖమ్మం స్పోర్ట్స్: క్రీడాకారుల ఆశలు ఫలించేలా అధికారులు, క్రీడా అసోసియేషన్ల బాధ్యులు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది! ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా ఖమ్మంలో ఆర్చరీ పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించింది. ఈమేర కు శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ఉత్తర్వులు వెలువడ్డాయి.
మూడు అంశాల్లో పరిశీలన
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ఈసారి తెలంగాణకు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం క్రీడల వారీగా వివిధ జిల్లాల్లో పోటీలు నిర్వహించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)బృందం ఖమ్మంలో పర్యటించి ఇక్కడ ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీల నిర్వహణకు వసతులు ఉన్నాయని నిర్ధారించింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్నే పోటీల నిర్వహణ వేదికలుగా ఖరారు చేశారు. దీంతో జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్య, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాధుల సారంగపాణి, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డితో పాటు క్రీడాసంఘాల బాధ్యులు పట్టుదలతో ప్రయత్నించడంతో జిల్లాలో ఆర్చరీ పోటీల నిర్వహణకు నిర్ణయించారు. ఫలితంగా జిల్లా కేంద్రంలో ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనుండగా.. ఖమ్మం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జాతీయస్థాయి పోటీలకు వేదికగా నిలవనుంది.


