రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంఅర్బన్: అభివృద్ధి వేగం ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ప్రధానమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 42వ డివిజన్లో రూ.95.50 లక్షల ‘సుడా’ నిధులతో నిర్మించే రోడ్లు, సీసీ డ్రెయిన్ల పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతీ అభివృద్ధి పనిని నాణ్యతతో పది కాలాలు మన్నికగా ఉండేలా పూర్తిచేయాలని సూచించారు. పనులను ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు పర్యవేక్షించాలని తెలిపారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్బాబా, ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్తో పాటు బాలసాని లక్ష్మినారాయణ, కమర్తపు మురళి, మల్లీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, సాధు రమేష్రెడ్డి, మిక్కిలినేని నరేంద్ర, తుపాకుల యలగొండస్వామి, అధికారులు పాల్గొన్నారు.
రఘునాథపాలెంలో స్టేడియం
జిల్లాలో క్రీడా, పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చేసి, వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈక్రమాన రఘునాథపాలెంలో రూ.92.76 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశామని వెల్లడించారు. ఈమేరకు పరిపాలనా అనుమతులు, నిధులు త్వరగా విడుదల చేయాలని శాట్ వీసీ, ఎండీ సోనీ బాలాదేవి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాక ఖమ్మంలో పూర్తయిన సింథటిక్ ట్రాక్ను వినియోగంలోకి తీసుకురావడం, కొత్తగూడెం వర్సిటీ స్టేడియం పనులపైనా సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, పర్యాటక శాఖ ఎండీ గౌతమితో కొత్తగూడెంలో హరిత హోటల్, ఖమ్మం హరిత భవన్, ఖమ్మం ఖిల్లా రోప్వే పనులపై సమీక్షించామని మంత్రి తెలిపారు.


