ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం, పల్లకీసేవ చేశారు. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్వాడీలకు
ఉచిత వెలుగులు
● ఇప్పటివరకు 1,056 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం
ఖమ్మంవ్యవసాయం: చిన్నారుల భవిష్యత్కు బాటలు వేసే అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేస్తోంది. కేంద్రాలపై బిల్లుల భారం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లాలో ఉచిత విద్యుత్కు 1,153 కేంద్రాలు రిజిస్టర్ అయ్యాయని, ఇందులో ఇప్పటి వరకు 1,056 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు.
మోడల్ సోలార్ పనులపై సమీక్ష
బోనకల్: మోడల్ సోలార్ విలేజ్ పనులు, మీటర్ల ఏర్పాటుపై ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి బోనకల్లో శనివారం ఉద్యోగులతో సమీక్షించారు. సబ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశమైన ఆయన పనుల్లో వేగం పెంచి లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు. మధిర డివిజన్ ఇంజనీర్ బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ వై.వీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కుష్ఠు బాధితుల
గుర్తింపుపై దృష్టి
ఖమ్మం వైద్యవిభాగం: అనుమానిత కుష్ఠు కేసులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ డీఎంహెచ్ఓ ఎల్.ప్రవీణ సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆమె డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుమాధవ్తో కలిసి లెప్రసీ నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతూ సర్జరీకి అర్హత కలిగిన వారిని సంబంధిత కేంద్రాలకు పంపించాలని తెలిపారు. అంతేకాక ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాని అర్హుల వివరాలు అందజేయాలని సూచించారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే బహుళ ఔషధ చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం చేయొచ్చనే అంశంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. అంతేకాక కొత్తగా కేసును గుర్తించగానే సమీప గృహాలు, సన్నిహితులను సర్వే చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పారామెడికల్ అధికారి మల్లయ్య, ఫిజియోథెరపిస్ట్ భద్రు, డీపీఎంఓలు శాస్త్రి, కృష్ణమూర్తి, కృష్ణ, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వినియోగదారుల ఫోరం రాష్ట్ర రిజిస్ట్రార్
ఖమ్మం లీగల్: రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్ రిజిస్ట్రార్ యేకొల్లు సత్యేంద్ర అధికారిక పర్యటనలో భాగంగా శనివారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం కమాన్బజార్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భద్రాద్రి జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి అవధానుల శ్రీనివాస్తో కలిసి సందర్శించి పూజలు చేశారు. వీరికి ఆలయ ఈఓతో పాటు కొప్పుల రవికుమార్ తదితరులు స్వాగతం పలకగా, పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచం అందజేశారు.


