ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారం, హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గమని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. ఖమ్మం మున్సి పల్ కార్పొరేషన్ జేఏసీ నూతన కార్యవర్గ నిర్మాణ సభ శనివారం ఖమ్మంలో మున్సిపల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏ.సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరి మాట్లాడుతూ పట్టణాలు, నగరాల పరిశుభ్రత, ప్రజల అవసరాల కోసం మున్సిపల్ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. అయితే, రాజకీయ నాయకులు, కార్పొరేటర్ల అనవసర జోక్యంతో స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేనందున, సమస్య వస్తే ఐక్యంగా ప్రశ్నించేలా జేఏసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే విధుల్లో గంట అదనంగా పనిచేయడానికి సిద్ధమే అయినా హక్కులు, ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు సరైన పోస్టింగ్లు, ప్రమోషన్లు రాక, డిప్యూటేషన్ల పేరిట వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీవేజ్ సిబ్బందితో సహా అందరికీ హెల్త్ కార్డులు వర్తించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
42 మందితో జేఏసీ..
కేఎంసీ ఉద్యోగుల జేఏసీని 42మందితో ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అధ్యక్షుడిగా జి.శ్రీనివాసరావు, కన్వీనర్గా బుర్రి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడిగా ఏ.సుధాకర్, సలహాదారుడిగా జీవీఎస్వీ.ప్రసాద్తో పాటు ఇతర పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు మోదుగు వేలాద్రి, వివిధ విభాగాల అధికారులు బెల్లం రాధిక, జెడ్ఎస్.జైపాల్, తాళ్లూరి శ్రీకాంత్, మురళి, ధరణికుమార్, నరేందర్, నవ్యజ్యోతి, గుడిపూడి సుజాత, గుగులోతు బిక్కు, జి.శ్రీనివాసరావు, బుర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కేఎంసీ జేఏసీ నిర్మాణ సభలో
టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి


