బేస్ ఆపరేటర్ తొలగింపు
● తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు ● త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణ
ఖమ్మంక్రైం: జిల్లా రవాణా శాఖ ఉద్యోగులను ఏసీబీ భయం వీడడం లేదు. ఏసీబీ అధికారులు తనిఖీలు, దాడులతో ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడమే కాక కార్యాలయంలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులతోపాటు కొందరు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. రవాణాశాఖలో అవినీతి పెరిగిందని పలువురు నేరుగా హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు చేపట్టిన విషయం విదితమే.
ఉద్యోగులకు నోటీసులు
గత ఏడాది చేపట్టిన తనిఖీల సందర్భంగా తొమ్మిది మంది ఉద్యోగులు.. ఏజెంట్లతో కుమ్మక్కయ్యారని తేల్చారు. ఈ మేరకు ఆధారాలు కూడా లభించడంతో పూర్తి స్థాయిలో విచారణ అనంతరం సదరు ఉద్యోగులకు ఏసీబీ జారీ చేసిన నోటీసులు గురువారం జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి అందాయి. దీంతో వారు హైదరాబాద్ లేదా వరంగల్లో త్వరలో జరిగే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
రవాణా శాఖ కార్యాలయంలోని తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన డీబీ (డేటాబేస్ ఆపరేటర్) యాకూబ్పాషాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తూ డీటీఓ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో మరొకరిని ఒకటి, రెండు రోజుల్లో నియమించే అవకాశముంది.


