● రెండు వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి ● మృతులిద్దరూ చిరువ్యాపారులే..
సత్తుపల్లిరూరల్: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. తోటలకు వెళ్లి జాయకాయలు కొనుగోలు చేసి రోజంతా వాహనాలపై తిరిగి అమ్మితే సాయంత్రానికి వచ్చే కొద్దోగొప్పో లాభమే ఆ కుటుంబాలకు జీవనాధారం. అందుకోసమే వయస్సు పైబడినా జీవనపోరాటం ఆపని ఆ ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు బలి తీసుకుంది. సత్తుపల్లి మండలం నారాయణపురం శివారులో గురువారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు...
అదుపు లేని అతివేగం..
పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన పానెం సులోమాన్(55), సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు(60) ఇద్దరూ సత్తుపల్లి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై తిరుగు తూ జామకాయల అమ్ముకుని జీవనం సాగిస్తున్నా రు. రోజులాగే గురువారం ఇద్దరూ గురుబట్లగూడెం సమీపాన తోటలో జామకాయలు కొనుగోలు చేసి రెండు ద్విచక్ర వాహనాలపై సత్తుపల్లి వైపు బయలుదేరారు. ఈక్రమాన నారాయణపురం శివారులో మూలమలుపు వద్ద అతివేగంగా ఎదురు నుంచి వచ్చిన లారీ అదుపు తప్పి వీరిని ఢీకొట్టి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో సులోమాన్, నాగేశ్వరరావు దేహాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలికి వచ్చిన 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే సులోమాన్, నాగేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈక్రమాన వీరి వద్ద రూ.10వేల నగదు, మొబైల్ ఫోన్లు సేకరించి వారి బంధువులకు అప్పగించిన సిబ్బందిని 108 జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, పర్యవేక్షణ అధికారి షేక్ నజీరుద్దీన్ అభినందించారు.


