ఖమ్మం సహకారనగర్: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను దారి మళ్లించినా, అక్రమంగా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై సమీక్షించారు. డొమెస్టిక్ సిలిండర్లను అనుమతి లేకుండా నిల్వ చేయడం, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలని సూచించారు. అలాకాకుండా డొమెస్టిక్ సిలిండర్లను దారి మళ్లిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు సివిల్ సప్లయీస్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేయలని స్పష్టం చేశారు. అలాగే, ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు ఈ–కేవైఈ చేయించుకుని డెలివరీ సమయాన ఓటీపీ ఇవ్వాలని సూచించారు. లేకపోతే సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై సమాచారం తెలిస్తే సివిల్ సప్లయీస్ ఉద్యోగులు లేదా పోలీస్స్టేషన్లో తెలపాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


