అభివృద్ధి బాధ్యత నాదే
వైరాలో జరిగిన ప్రతీ అభివృద్ధి
కాంగ్రెస్ హయాంలోదే
వీధి వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్
స్వచ్ఛ మధిర కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
వైరా/మధిర : కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వైరా, మధిర పట్టణాలను మరింతగా అభివృద్ధి చేసుకుందామని, ఆ బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ వైరాలో రోడ్లు, డ్రెయినేజీలు ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేసుకుంటూ మోడల్ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగినవేనని చెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వ హయాంలోనే వైరాకు 100 పడకల ఆస్పత్రి వచ్చిందని, రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి ఐదేళ్లు అయిందని, మొండి గోడలతో వైరా రింగ్ రోడ్డు సెంటర్ కళావిహీనంగా కనిపిస్తోందని, అందుకే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేశామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనుల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇక మధిరలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని భట్టి పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు తనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా అవకాశం వచ్చిందని, దీన్ని అభివృద్ధికి వినియోగించుకుందామని అన్నారు. తాను తెచ్చే నిధులతో చేపట్టే పనులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పాలకవర్గమే ఉండాలని, అందుకోసం కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. భారీ వరదలు వచ్చినా పట్టణంలోకి నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆయా సభల్లో వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మార్క్పెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి కట్ల రంగారావు, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, సూరంశెట్టి కిషోర్, మిర్యాల రమణ గుప్తా, మిట్టపల్లి నాగి, దార్న శేఖర్, యన్నం కోటేశ్వరరావు, దోర్నాల శిరీష పాల్గొన్నారు.


