ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వసతులు
● అత్యవసర కొనుగోళ్లకు రూ.5లక్షల నిధులు ● సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జనరల్ ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వసతులు మెరుగుపర్చాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన ఆస్పత్రి పనితీరు, పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆస్పత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు, సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్నందున మార్పు రావాలని స్పష్టం చేశారు. రూ.5 లక్షల నిధులు అందుబాటులో ఉంటాయని, ఏ విభాగంలోనైనా అత్యవసరంగా పరికరాలు అవసరమైతే కొనుగోలు చేయాలన్నారు. అంతేకాక రూ.1.65కోట్లతో నిర్మిస్తున్న టాయిలెట్లు, లిఫ్ట్ మరమ్మతులు త్వరగా పూర్తిచేయడంతో పాటు అదనంగా వాటర్ సంప్ నిర్మించాలని, ఫైర్ సేఫ్టీ, సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రిలో ఆర్ఎంఓలు, బయో మెడికల్ ఇంజనీర్ నియామకం, ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక బ్లాక్ నిర్మాణం, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంపై దృష్టి సారించాలని తెలిపారు. నెలకు రూ.55 లక్షలు వెచ్చిస్తున్నందున పారిశుద్ధ్యం మెరుగపడకపోతే ఏజెన్సీ రద్దుకు లేఖ రాయాలన్నారు. అంతేకాక కార్మికుల హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, వైద్య ఆరోగ్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ సహాయ కమిషనర్ అనిల్కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అప్రోచ్ రోడ్డు ఉంటేనే లే ఔట్ అనుమతి
ఖమ్మం సహకారనగర్: లే ఔట్లకు అనుమతుల జారీ విషయంలో నిబంధనలను పక్కాగా అమలుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి లే ఔట్ కమిటీ సమావేశం నిర్వహించగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 డ్రాఫ్ట్ లేఔట్, నాలుగు తుది లేఔట్ దరఖాస్తులను పరిశీలించాక కలెక్టర్ మాట్లాడారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేకుండా చూడడమే కాక అప్రోచ్ రోడ్డు 18 మీటర్లు ఉంటేనే క్షేత్థ్రాయి పరిశీలన అనంతరం అనుమతికి సిఫారసు చేయాలని సూచించారు. ఈసమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, వివిధ శాఖల అధికారులు వెంకట్రెడ్డి, శ్రీనివాసాచారి, రాజేందర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


