ప్రతీ హామీని అమలు చేశాం | - | Sakshi
Sakshi News home page

ప్రతీ హామీని అమలు చేశాం

Jan 10 2026 9:15 AM | Updated on Jan 10 2026 9:15 AM

ప్రతీ హామీని అమలు చేశాం

ప్రతీ హామీని అమలు చేశాం

జీపీల తరహాలో మున్సిపాలిటీల్లోనూ గెలిపించండి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇల్లెందు/పినపాక: ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం వల్లే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69శాతం పంచాయతీల్లో విజయం సాధ్యమైందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తీర్పు ఇవ్వాలని కోరారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్‌ ఆవరణలో, పినపాకలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులను సన్మానించాక మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలనలో సర్పంచులు, వార్డు సభ్యులు కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ద్వారానే ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వస్తామని అన్నారు. మార్చి చివరి నాటికి రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ పోరిక బలరాం నాయక్‌ మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లెందులో నాటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు చేపట్టకుండానే మొండి చేయి చూపించారని విమర్శించారు. గెలిచిన సర్పంచ్‌, వార్డుసభ్యులు ఇంటి వద్ద కూర్చోకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పాటుపడాలని కోరారు. నియోజకవర్గానికి తమ ప్రభుత్వం సీతారామ నీళ్లు ఇస్తుందని, బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా మంత్రి పొంగులేటి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement