మూడేళ్లలో సీతారామ పూర్తి
● రూ.100 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ ● రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల
అశ్వారావుపేటరూరల్: రానున్న మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టును వందశాతం పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి గోదావరి జలాలను అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ పేరుతో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రైతు మేళా, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఆతర్వాత దమ్మపేట గండుగులపల్లిలో సీతారామ ఎత్తిపోతల పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు గడిచిన రెండేళ్లుగా అమలు కానీ యంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.100కోట్ల వ్యయంతో 1.30లక్షల మంది రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తామని చెప్పారు.
రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి
దేశంలోని 29 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఉమ్మడి రాష్ట్రం హయాంలో కూడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరిసాగులో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ త్వరలోనే సీతారామ 4వ పం్ప్ హౌస్ను పూర్తి చేసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా గోదావరి నీళ్లు అందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ విస్తరిస్తానమి తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జానయ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ భాషా, అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి తదితరులు పాల్గొన్నారు.


