‘యాప్’సోపాలు
పాస్బుక్
ఆధారంగా కూపన్లు
ప్రతీ రైతుకు సరిపడా యూరియా
● యూరియా కొనుగోలుకు రైతుల అష్టకష్టాలు ● ఇదే అదునుగా అక్రమాలకు తెరలేపిన వ్యాపారులు ● బస్తా రూ.266కు బదులు రూ.400తో విక్రయం
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్లో మాదిరిగానే అన్నదాతలకు యాసంగిలో కూడా యూరియా అవస్థలు తప్పటం లేదు. ఎరువు కొరత రాకుండా ప్రభుత్వం యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చినా సక్రమంగా అమలుకాక రైతులు పాట్లు పడుతున్నారు. రైతులు పీఏసీఎస్లు, దుకాణాల వద్ద పడిగాపులు కాయకుండా అవసరమైన మేరకే విడతల వారీగా తీసుకోవచ్చని ప్రత్యేక యాప్ రూపొందించి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలుత ఈనెల 20నుంచి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, తర్వాత అన్ని జిల్లాలకు అమలుచేశారు. ఖమ్మం జిల్లాలో సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ప్రకటించగా రైతులు ఆదివారం నుంచే యాప్లో యూరియా బుకింగ్ కోసం ప్రయత్నిస్తే ఫలితం కానరాలేదు. సోమవారం కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో పాత విధానంలో పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇక జిల్లాను ఫెర్టిలైజర్ యాప్లో చేర్చలేదని కొందరికి మెసేజ్ రావడం గమనార్హం. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన అధికారులు పాస్బక్ల ఆధారంగా కూపన్లు జారీ చేశారు.
అడ్డదారులు తొక్కుతున్న వ్యాపారులు
ఫర్టిలైజర్ యాప్ పని చేయకపోవడాన్ని అదునుగా తీసుకున్న జిల్లాలోని ఎరువుల వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. చింతకాని మండలం నాగులవంచలో అర్ధరాత్రి వేళ యూరియా విక్రయించడం బయటపడింది. ఇక కొందరు వ్యాపారులు యూరియాను బ్లాక్ చేసి తెలిసిన రైతుల పేరుతో విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేశారని సమాచారం. మరికొందరు ఇతర ఎరువులను లింక్ చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల రూ.266 యూరియా బస్తాను రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
ఇండెంట్ 72వేల మెట్రిక్ టన్నులు
జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 4.16లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగవుతాయని, ఇందుకోసం 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ నివేదించింది. ప్రస్తుతం జిల్లాలో 34,891మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నట్లు చెబుతున్నా మొక్కజొన్న తదితర పంటలకు అవసరం పెరగడంతో రైతులు బారులు దీరుతున్నారు. ఇదే సమయాన యాప్ అందుబాటులోకి రావడం, బుకింగ్లో ఇక్కట్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కల్లూరురూరల్/నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: యాప్ ద్వారా సోమవారం ఉదయం కొందరు రైతులకు యూరియా కోసం స్లాట్ బుకింగ్ అయినట్లు తెలిసింది. వీరితో పాటు బుకింగ్ చేసుకోని వారు కూడా పీఏసీఎస్ల వద్ద బారులు దీరారు. మధ్యాహ్నం కల్లా యాప్ సర్వర్ మొరాయించడం, జాబితాలో జిల్లా పేరు లేదని వస్తుండడంతో ఆందోళన చెందారు. దీంతో యాప్తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని నిరసన చేపట్టగా కల్లూరు మండలంలోని రైతులకు ఇప్పటికే జారీ చేసిన పాస్బుక్ల్లోని వివరాల ఆధారంగా కూపన్లు జారీచేశారు. ఇక నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన రైతు షేక్ రశీద్, ముదిగొండ మండలానికి చెందిన రైతుకు స్లాట్బుక్ కాగా పైనంపల్లి, రాజేశ్వరపురం సొసైటీ యూరియా తీసుకున్నారు. మిగతా వారికి బుక్ కాకపోవడంతో అవస్థ పడ్డారు. అలాగే, తిరుమలాయపాలెం మండలంలోని జల్లెపల్లి, పిండిప్రోలు, తిరుమలాయపాలెం సొసైటీ కార్యాలయాల్లో రైతులు పడిగాపులు కాశారు. జల్లెపల్లిలో 100 బస్తాల కోసం బుక్ చేసుకున్నా ఎక్కువ మంది రైతులు రావడంతో యూరియా ఇవ్వలేదు. పిండిప్రోలులో ఒక్కో బస్తా చొప్పున సరఫరా చేశారు.
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం వ్యవసాయం: పంటల సాగుకు అనుగుణంగా రైతులకు సరిపడా యూరియా సకాలంలో పంపిణీ చేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి వీసీ ద్వారా సమీక్షించిన ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా సరిగ్గా లేకపోవడంతో వానాకలం సీజన్లో ఇబ్బందులు వచ్చాయని, ఇప్పుడు యూరియా కొరత లేనందున అదనపు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, యాప్ వినియోగం లేని జిల్లాల్లో కూడా పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా సరఫరా చేయాలని సూచించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా పంపిణీ వివరాలను వెల్లడించగా, డీఏఓ డి.పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, డీసీఓ గంగాధర్, జిల్లా మార్కెటింగ్అధికారి అలీం తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో 9, 407 మెట్రిక్ టన్నుల యూరియా అందులో ఉందని, మరో 5,100 మెట్రిక్ టన్నులు రిజర్వ్ చేశామని కలెక్టర్ అనుదీప్ ఓ ప్రకటనలో తెలిపారు. యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే ఆఫ్లైన్ విధానంలో ఇస్తామని, ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి యూరియా సరఫరా చేస్తామనివెల్లడించారు. అలాగే, ఎవరైనావ్యాపారులు అక్రమాలకు ఆల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాని డీఏఓ
హె చ్చరించారు.
‘యాప్’సోపాలు


