
ఇక భూ గర్భంలో!
ఏమిటీ విద్యుత్ లైన్..
ఖమ్మం కార్పొరేషన్, మధిర టౌన్లో ప్లానింగ్ ఇలా..
రెండు చోట్లా కలిపి రూ.1,268.05 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం పొందగానే నిధులు విడుదల బెంగళూరులో ఈ విధానంపై జిల్లా అధికారుల అధ్యయనం
విద్యుత్ లైన్లు..
సాక్షి ప్రతినిధి,ఖమ్మం : గాలి, వానతో విద్యుత్ తీగలు తెగడంతో గంటల పాటు సరఫరాకు అంతరాయం.. వేలాడే తీగలతో ఏదో ఒక చోట ప్రమాదం వంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. భూ ఉపరితలంపై ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లతో కలిగే ఈ సమస్యల పరిష్కారానికి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దేశంలోని బెంగళూరు నగరంలో కొన్ని ప్రాంతాలు, ముంబై నగరమంతటా ఈ సిస్టమ్తో విద్యుత్ సరఫరా విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని ఏర్పాటు చేస్తుండగా.. జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్, మధిర మున్సిపాలిటీల్లోనూ అమలుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వానికి డీపీఆర్ పంపించారు. నిధులు విడుదల కాగానే ఈ రెండు ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయి.
అక్కడి సిస్టమ్ పరిశీలించి..
ఈ ఏడాది జూన్ 27 నుంచి మూడు రోజులు పాటు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి నేతృత్వంలో ముఖ్య అధికారులు బెంగళూరులో పర్యటించి అండర్ గ్రౌండ్ విద్యుత్ సిస్టంపై అధ్యయనం చేశారు. భూగర్భ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు, వీధి లైట్ల కోసం ప్రత్యేకంగా వేసిన లైన్లు, వాటి నిర్వహణపై బెంగళూరుకు చెందిన విద్యుత్ అధికారులతో చర్చించారు. విద్యుత్ సరఫరాలో ప్రయోజనాలు, సమస్యలు, మానిటరింగ్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ట్రాన్స్ఫార్మర్లు, లైన్లను పరిశీలించారు. ఆ తర్వాత ఖమ్మం కార్పొరేషన్, మధిరలో ఈ విద్యుత్ సిస్టమ్ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించారు.
ఖమ్మం, మధిరలో ఏర్పాటు..
జిల్లాలో తొలుత ఖమ్మం కార్పొరేషన్, మధిర మున్సిపాలిటీల్లో ఈ విద్యుత్ సిస్టమ్ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు చోట్లా ఉన్న విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లు ఎన్ని కిలోమీర్లు వంటి వివరాలతో ప్రభుత్వానికి డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పంపారు. రెండు ప్రాంతాల్లో కలిపి అంచనా వ్యయం రూ.1,268.05 కోట్లు అవుతుందని అందులో పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్కు రూ.1,241.96 కోట్లు, మధిరకు రూ.26.09 కోట్లు అవసరమని చూపారు. మధిర మెయిన్రోడ్డులో ఆత్కూరు క్రాస్ రోడ్డు నుంచి దెందుకూరు వరకు తొలిదశ కింద ప్రతిపాదనలు వెళ్లగా.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎన్నెస్టీ రోడ్డు, పీఎస్ఆర్ రోడ్డులో రూ.14.35 కోట్లు వ్యయంతో ఈ లైన్లు వేయనున్నారు. ఆ తర్వాత మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ లైన్ల పనులు చేపడతారు.
అండర్గ్రౌండ్ విద్యుత్ లైన్ సిస్టమ్తో అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా అవుతుంది. భూ ఉపరితలంపై ఉన్న లైన్లతో ఇన్సూలేషన్ ఉండదు. పట్టుకున్నా.. చెట్టుకొమ్మ పడినా ట్రిప్ అవుతుంది. అండర్గ్రౌండ్ సిస్టమ్లో ఐరన్, సిమెంట్ స్తంభాలు ఉండవు. ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే ఉపరితలంపై ఉంటాయి. ఈ సిస్టమ్తో ప్రమాదాలు జరగవు. జిల్లాలో మధిర మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్లో ఈ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ సిస్టమ్ అమలుపై ఇటీవల బెంగళూరు నగరానికి వెళ్లి పరిశీలించాం.
ఇనుగుర్తి శ్రీనివాసాచారి, విద్యుత్ శాఖ ఎస్ఈ
ప్రస్తుతం కనిపిస్తున్న విద్యుత్ కనెక్షన్లు, తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి భూగర్భ విద్యుత్ లైన్లలో కనిపించవు. కొన్ని ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే పైకి కనిపిస్తాయి. సిమెంట్ లైనింగ్ కాల్వలో ఇసుక పోసి ప్రత్యేకంగా తయారు చేసిన పైపుల్లో విద్యుత్ తీగలు వేసుకుంటూ వెళ్తారు. నైపుణ్యం ఉన్న ఎలక్ట్రికల్ సిబ్బందితో మాత్రమే ఈ పనులు చేయిస్తారు. అంతేకాక ఈ విద్యుత్ మానిటరింగ్కు కొన్ని కిలోమీటర్లకు ఒక పర్యవేక్షణ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సెంటర్ నుంచి టెక్నీషియన్లు నిత్యం కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ చేస్తారు. రూ.4 కోట్ల విలువైన చెకింగ్ మిషన్ వ్యాన్.. సరఫరాలో సమస్య ఎక్కడ వచ్చిందో క్షణాల్లోనే గుర్తిస్తుంది. దీంతో వెంటనే మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరిస్తారు.
వివరాలు ఖమ్మం మధిర
కనెక్షన్లు 1,20,094 1,474
ట్రాన్స్ఫార్మర్లు 2,175 61
33 కేవీలైన్ కి.మీ. 65.49 0.5
11 కేవీ లైన్ కి.మీ. 286.418 18.076
ఎల్టీ లైన్ కి.మీ. 645.358 12.036
అంచనా వ్యయం రూ.1,241.96 కోట్లు రూ.26.09 కోట్లు
మధిర, ఖమ్మం కార్పొరేషన్లో ఏర్పాటుకు కసరత్తు

ఇక భూ గర్భంలో!

ఇక భూ గర్భంలో!