
యూజీడీ పనులు నాణ్యంగా ఉండాలి
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని సచివాలయంలో మధిర పట్టణ సమగ్రాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నెలకు ఒకసారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించాలని భట్టి సూచించారు. నాణ్యతతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల ప్రగతికి సంబంధించి ప్రతి వారం, 15 రోజులు, నెల రోజుల వ్యవధిలో టార్గెట్లు నిర్దేశించుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఈ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులపై తాను తరచూ సమీక్ష చేస్తానని తెలిపారు. అమృత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, జాలిమూడి నుంచి మధిర పట్టణానికి తాగునీటి సరఫరా తదితర అంశాలను సమీక్షించారు. నెల రోజుల్లో అంబేద్కర్ స్టేడియం పనులు పూర్తి చేయాలన్నారు. మధిరలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్కు తరలించాలి తప్ప రహదారుల వెంట కనిపించొద్దని స్పష్టం చేశారు. పర్యాటక, మున్సిపల్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ట్యాంక్ బండ్, ఇతర సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ భాస్కర్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.